
నెరవేరిన ఉపాధి లక్ష్యం
శాశ్వత పనులకు
అధిక ప్రాధాన్యం
జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో చేపట్టాల్సిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బంది చేత ప్రత్యేకంగా గుర్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గడిచిన అక్టోబర్, నవంబర్ నెలలో పనుల గుర్తింపు చేపట్టారు. ఆయా గ్రామాల్లో రైతులు, కూలీలు, ప్రజలతో కలిసి పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అనంతరం గ్రామాల వారీగా ప్రణాళికను తయారు చేశారు. శాశ్వత పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పంటపొలాల్లో చిన్న కుంటలు, వ్యవసాయ పొలాలకు బాటలు, పంట కాల్వల పూడికతీతల పనులతో పాటు, నీటి సంరక్షణ (పాంపాండ్స్, బావుల పూడికతీత, వాలుకట్టలు) ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్ పిట్లు, నాడేక్ కంపోస్ట్ పిట్లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, గొర్రెల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని చేయాల్సిన పనులు, కూలీల డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నారు. వ్యవసాయ సీజన్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఆయా పంచాయతీల పరిధుల్లో ఏరకమైన పనులు చేపట్టవచ్చో ఇలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పనులను గుర్తించారు. పనులను గుర్తించిన అధికారులు అందుకు అవసరమయ్యే పనిదినాల సంఖ్య, బడ్జెట్ను (కూలీల వేతనాలు, మెటిరియల్కు అయ్యే ఖర్చు) పంచాయతీల వారీగా అంచనా వేసి రికార్డుల్లో నమోదు చేశారు. ఈవివరాలను మండలాల వారీగా క్రోడీకరించి డీఆర్డీఏ కార్యాలయానికి కొద్దిరోజుల క్రితం నివేదించారు. అక్కడి అధికారులు మరోసారి మండలాల వారీగా గుర్తించిన పనులను, పనిదినాల వివరాలను పరిశీలించనున్నారు. ఇక్కడ పరిశీలించిన అనంతరం కలెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మరో పదిరోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాల లక్ష్యం.. బడ్జెట్ కేటాయింపులు నిర్ధేశితమవుతాయని అధికారులు తెలిపారు.
గద్వాల న్యూటౌన్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యం పూర్తి అయ్యింది. అంతేగాక, ఈ ఏడాది (2025–26) చేపట్టే వాటిలో వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి సిబ్బంది పనులను గుర్తించారు.
ప్రత్యేక దృష్టితో పనిదినాలు పూర్తి
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టేందుకు గాను 23,22,812 పనిదినాల సంఖ్య లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించడంతో పనిదినాల లక్ష్యం నేరవేరింది. ఇందుకోసం గడిచిన ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం లక్ష్యాన్ని ఆయా మండలాలకు నెల వారీగా లక్ష్యాన్ని విభజించారు. దీంతోపాటు ప్రతి నెల ఆయా మండలాల్లో జరిగే పనులు, హాజరవుతున్న కూలీలు, పనిదినాల సంఖ్యపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడైతే పనులు జరగలేదో అక్కడ ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో లక్ష్యం నెరవేరింది.
ప్రతి కూలీకి పని కల్పించాం
2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హమీ కింద చేపట్టాల్సిన పనిదినాల లక్ష్యం నెరవేరింది. నడిగడ్డలో వలసలు పూర్తిగా నివారించి, ప్రతి కూలీకి ఉపాధిహామీ పథకం కింద పని కల్పిస్తాం. ఈ ఏడాదిలో (2025–26) వ్యవసాయ ఆధారిత పనులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నాం. పనులను సైతం గుర్తించాం. 2025–26లో పనిదినాల లక్ష్యం నెరవేరేలా ఆరంభం నుంచి చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావ్, డీఆర్డీఓ
2024 –25లో 23.22 లక్షల పనిదినాలు పూర్తి
కూలీలకు వంద శాతం పని కల్పించిన వైనం
2025–26 లో వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యం
ఇప్పటికే పనులను గుర్తించిన ఉపాధి సిబ్బంది

నెరవేరిన ఉపాధి లక్ష్యం