
వంటింటికి గ్యాస్ సెగ
గద్వాలటౌన్: నిత్యావసరాల ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వంట నూనెలు సలసలమంటుండగా.. కూరగాయలు కంటతడి పెట్టిస్తున్నాయి. వీటికే సామాన్యుల వంటగది ఉక్కిరిబిక్కిరవుతోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతుండటంతో పేదల నెలవారీ బడ్జెట్ తలకిందలవుతోంది. తాజాగా గృహ వినియోగ 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరగడం మరింత గుదిబండగా మారింది.
● జిల్లాలో మొత్తం 11 ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో వివిధ రకాలకు చెందిన మొత్తం 1,76,578 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,68,637 కనెక్షన్లు గృహ వినియోగానికి సంబంధించినవి ఉన్నాయి. గతంలో వీటిపై ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. రానురాను ఏడాదికి ఆరు సిలిండర్లకే రాయితీని పరిమితం చేశారు. సిలిండర్ ధరలు పెరుగుతుండటంతో పాటు రాయితీ తగ్గిపోయింది. ప్రస్తుతం సబ్సిడీని కూడా పూర్తిగా ఎత్తేశారు. అయితే ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందిన వారికే మాత్రమే రాయితీ దక్కనుంది. తాజాగా రూ.50 పెరగడంతో ప్రస్తుతం గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.925కు చేరుకుంది. అయితే జిల్లాలో ప్రతినెలా సరాసరి 70వేల గృహవినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు అంచనా. తాజా పెంపుతో గృహ సిలిండర్ వినియోగదారులకు ప్రతినెలా రూ. 35లక్షల వరకు అదనపు భారం పడనుంది.
రెండేళ్లుగా తగ్గుతూ..
గ్యాస్ ధరలు రెండేళ్ల క్రితం భారీగా పెరగడంతో ప్రజలు సతమతమయ్యారు. తర్వాత క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. 2023 మార్చి వరకు రూ. 1175 ఉన్న ధర.. నవంబర్లో రూ. 1,125కు చేరింది. తర్వాత నెల రోజులకే రూ.975కు తగ్గింది. ఇలా నాలుగు నెలలపాటు కొనసాగిన ధర 2024 మార్చి లో రూ. 875కు తగ్గింది. అప్పటి నుంచి ఏడాది పాటు ధర స్థిరంగా ఉంటూ వస్తోంది. తాజాగా గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మహాలక్ష్మి, దీపం పథకం లబ్ధిదారులపై మాత్రం పెరిగిన ధర ప్రభావం ఉండదు.
భారం మోపడం తగదు..
వంట గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వాలే అలవాటు చేశాయి. సబ్సిడీలు ఇచ్చి మరీ కొనిపించారు. సబ్సిడీ నగదు క్రమేణ ఎత్తేశారు. రవాణా చార్జీలను అదనంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు సిలిండర్పై రూ.50 ధర పెంచడం దారుణం. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెంచేసి జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. సామాన్యులపై మోయలేని భారం మోపడం తగదు. – రేణుక, గృహిణి, గద్వాల
వంటావార్పు కష్టమే..
అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. ఏం కొనలేం.. తినలేం అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గ్యాస్ ధర పెరగడంతో వంట వండుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సిలిండర్ ధర పెరిగిందని.. కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి లేదు. పేదలకు ఈ ధరల పెరుగుదల భారంగా మారుతుంది. – సావిత్రి, గృహిణి, గద్వాల
●
గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెంపు
సబ్సిడీని పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం
జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ. 35లక్షలకు పైగా భారం

వంటింటికి గ్యాస్ సెగ

వంటింటికి గ్యాస్ సెగ