
గడువు లేక.. పరికరాలు పొందక !
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీపై పరికరాలు
అయిజ: రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఇవ్వడంతో అర్హులైన రైతులు ఎంతోమంది పథకానికి దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇక రెండు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక.. అందులోనూ కేవలం మహిళా రైతులే అర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
సబ్సిడీపై పరికరాలు
వ్యవసాయదారులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభించి రైతులకు అవసరమైన వివిధ రకాల పరికరాలు, యంత్రాలు 50 శాతం సబ్సిడీతో అందించేందుకు వ్యవసాయ శాఖ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కేవలం మహిళా రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులను చేస్తోంది. దరఖాస్తు చేసేందుకు కేవలం రెండు, మూడు రోజుల గడువు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందిస్తోంది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాలకు చెందిన మహిళా రైతులు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన మహిళా రైతులకు సబ్సిడీలో అవసరమైన వ్యవసాయ పరికరాలు సరఫరా చేస్తారు.
రెండు రోజులు.. 58 దరఖాస్తులు
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పథకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అర్హులైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 58 మంది దరఖాస్తు చేసుకున్నారు.
నిబంధనలతో ఇబ్బందులు..
ట్రాక్టర్కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్సీ మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం నిబంధనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ పథకాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి జిల్లాల వారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాకు సంబందించి 234 యూనిట్లు కేటాయించి, రూ.56.88 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అధికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ ఫామ్ మెకలైజేషన్ పథకం కింద ఎంపికై న రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తారు. ప్రభుత్వం పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది.
జిల్లాకు మంజూరైన యూనిట్ల వివరాలిలా..
పరికరాలు యూనిట్లు
ట్రాక్టర్లు 3
రోటవేటర్లు 30
పవర్ స్ప్రేయర్లు 73
బ్యాటరీ స్ప్రేయర్లు 73
సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ 5
డిస్క్ హారో కేజ్ వీల్స్ 39
పవర్ టిల్లర్ 2
స్ట్రా వేలర్లు 2
బండ్ ఫార్మర్ 3
బ్రష్ కట్టర్లు 2
పవర్ వీడర్లు 2
గడువు పెంచాలి
దరఖాస్తు చేసుకునేందుకు కేవలం మూడురోజులు గడువు మాత్రమే విధించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు వారి వారి కుల ధ్రువీకరణ పత్రాలను ధరఖాస్తులకు జత చేయాల్సి ఉంటుంది. సరైన సమయానికి కుల ధ్రువీకరణ పత్రం అందకపోవడంతోదరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పెద్దలు ఆలోచించి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలి.
– ఆంజనేయులు, అయిజ
అర్హులందరికీ అందజేయాలి
ఏడేళ్ల తర్వాత ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తుంది. మహిళల పేరుతో రాయితీ పరికరాలు అందించడం బాగుంది. అయితే చాలా తక్కువ పరికరాలు జిల్లాకు కేటాయించారు. అవి ఏమాత్రం సరిపోవు. అర్హులైన రైతులందరికీ సరిపడా పరికరాలు మంజూరు చేయాలి.
– వెంకటమ్మ, అయిజ
త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం
ఉన్నతాధికారుల ఆదేశానుసారం మహిళా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించాం. ఈనెలాఖరు వరకు లబ్ధిదారులను గుర్తించి త్వరలో అర్హులైన రైతులకు రాయితీపై పరికరాలను అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది.
– సక్రియానాయక్,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లాకు 234 యూనిట్లు.. రూ.56.88 లక్షలు మంజూరు
దరఖాస్తుకు తక్కువ సమయం
ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు
చాలా మంది అర్హులు పథకానికి దూరం
26న ముగిసిన సమయం.. జిల్లాలో కేవలం 58 దరఖాస్తుల స్వీకరణ
గడువు పెంచి లబ్ధి చేకూర్చాలని రైతుల వినతి

గడువు లేక.. పరికరాలు పొందక !

గడువు లేక.. పరికరాలు పొందక !

గడువు లేక.. పరికరాలు పొందక !