భూపాలపల్లి అర్బన్: పెండింగ్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయానికి రావాల్సిన ప్రమోషన్లు నిలిచిపోవడం, ప్రమోషన్ పొందిన వారికి బేసిక్ ఫిక్సేషన్ చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ మైనింగ్ సర్దార్లుగా పని చేస్తున్నవారికి కాలపరిమితి పూర్తయినప్పటికీ ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు. అంతర్గతంగా ఎస్ఎఫ్, ఎంఎస్ తీసుకున్న ఉద్యోగులకు సీ గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వకపోవడం కూడా సరికాదని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఉన్న మైనింగ్ స్టాఫ్ ఖాళీలను తక్షణమే భర్తీచేసి, అండర్గ్రౌండ్ మైన్స్లో తగిన సిబ్బందిని నియమించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నూకల చంద్రమౌళి, సోతుకు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


