విద్యార్థులకు స్పెషల్‌ కిట్లు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్పెషల్‌ కిట్లు

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

భూపాలపల్లి అర్బన్‌: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 21 రకాల వస్తువులు గల కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వం ఆ కిట్లకు ఆర్డర్‌ ఇవ్వగా, పాఠశాలలు ఆరంభమయ్యే నాటికి అన్ని పాఠశాలలకు చేర్చనున్నారు. పాఠశాలల తొలి రోజు నుంచే విద్యార్థులకు కిట్లు అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో గల పాఠశాలలు మినహా, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 21 రకాల వస్తువులు గల కిట్లను అందజేయనున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు నోట్‌బుక్స్‌, రెండు జతల యూనిఫామ్స్‌, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇచ్చే వాటితో పాటు మరో యూనిఫాం జత అదనంగా ఇవ్వనున్నారు. షూస్‌, రెండు జతల సాక్సులు, స్కూల్‌ బ్యాగ్‌, బెల్ట్‌, టై, వర్క్‌ బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్‌, షార్పనర్‌, జామెట్రీ బాక్స్‌, డిక్షనరీ గల కిట్‌ ఇవ్వనున్నారు. ఆయా జిల్లాల్లో వేర్వేరు రకాల యూనిఫామ్స్‌ ఉండగా, ఈ సారి రాష్ట్రమంతటా ఒకే రకమైన యూనిఫామ్‌ను అందజేయనున్నారు. పాఠశాలల ఆరంభం నాటికి వాటిని అందజేసేందుకు ప్రభుత్వ విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.

కిట్లతో విద్యార్థుల సంఖ్య పెరిగేనా..

పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అందరూ తల్లితండ్రులకు పిల్లలను బాగా చదివించాలనే చైతన్యం పెరిగింది. సాధ్యమైనంత వరకు తమ స్థోమతను ఆధారంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పదిహేనేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేవి. 2010, 2012లో మోడల్‌ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ విద్యాలయాలు వచ్చిన తర్వాత కొంత మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటికే ఎస్సీ, ఎస్టీ గురుకులాలు ఉండగా, అక్కడక్కడ బీసీ గురుకులాలు ఉన్నాయి. వీటికి తోడు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు ఎస్బీ గురుకులాలు, రెండు బీసీ గురుకులాలు, ఒక మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రెసిడెన్షియల్‌ తరహాలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధన చేస్తున్నారు. మొదట 5, 6, 7 తరగతులతో ఆరంభించి క్రమంగా అప్‌గ్రేడ్‌ చేశారు.

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థులు

జిల్లాలో 394 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌, 8 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 16,256 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో యేటా ఫీజుల భారం పెరిగి పోతుండడంతో విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రోత్సహించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందజేయనున్న కిట్లు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచిచూడాలి.

స్పెషల్‌ కిట్లలో ఉండేవివే..

మూడు జతల యూనిఫామ్‌ క్లాత్‌, షూష్‌, రెండు జతల సాక్స్‌, స్కూల్‌ బ్యాగ్‌, బెల్ట్‌, టై, నోట్‌ బుక్స్‌, పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, పెన్సిళ్లు, ఎరేజర్‌, జామెట్రీబాక్స్‌, డిక్షనరీ ఉండనున్నాయి.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 21 రకాల వస్తువులు

రాష్ట్రమంతటా ఒకే యూనిఫాం

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కసరత్తు

Advertisement
 
Advertisement
Advertisement