సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఎండోమెంట్ అధికారులు సమష్టిగా పనిచేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతృప్తి కలిగేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భక్తుల కోణంలో చర్చించి వారికి అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
డార్మెటరీ నిర్మాణానికి గతంలోనే ఆమోదం..
మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) గతంలో ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు జరిగి నిధులు మంజూరు లేకపోవడంతో నిలిచిపోయింది. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయించాలి. గతంలో ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. కానీ, నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐమస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాలని కోరుతున్నారు.
భక్తుల డిమాండ్లు
ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి.
● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి.
● మల, మూత్ర విసర్జనకు ఇబ్బందులు పడుతుండగా భక్తులకు సరిపోయే విధంగా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి.
● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాలు నిర్మించాలి.
● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి.
● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి, ఆర్కియాలజి శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. ఆలయానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునీకరించాలి.
● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి.
● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ది పరిచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మల్లన్న భక్తుల్లో ఉంది.
● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందుల కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లెటింగ్ టవర్స్, భద్రతపరంగా మరో 50 సీసీ టీటీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి.
● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ వాహనాలను ఉంచడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వెంటనే మరోచోటకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు.
నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం
కలెక్టరేట్లో అధికారులతో
చర్చించనున్న కలెక్టర్
అభివృద్ధిపై దృష్టిసారించాలంటున్న భక్తులు


