ఆరబెట్టలేక.. అమ్ముకోలేక! | - | Sakshi
Sakshi News home page

ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!

Oct 27 2025 8:24 AM | Updated on Oct 27 2025 8:24 AM

ఆరబెట

ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!

వరంగల్‌: పండించిన పత్తిని మద్దతు ధరకు రైతులు అమ్ముకునే పరిస్థితులు కానరావడం లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మార్కెట్‌కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

స్లాట్‌ బుకింగ్‌..

పత్తి అమ్మేందుకు ఈ సీజన్‌ నుంచి సీసీఐ కపాస్‌ కిసాన్‌ యాప్‌ను అమలులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రైతులు తమ పత్తిని సీసీఐకి అమ్మాలంటే కచ్చితంగా మార్కెట్‌ యార్డుకు రాకముందే యాప్‌ ద్వారా జిన్నింగ్‌ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. అందులో తేదీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే యార్డుకు రావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదట పత్తి కొనుగోళ్లు వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఏ, బీ కేంద్రాల్లోనే ప్రారంభిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు..

సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్‌ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామ 15, మహబూబాబాద్‌ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,,866, 12 శాతం ఉంటే 7785.60 ధర చెల్లిస్తారు.

పాత పద్ధతితోనే రైతుకు మేలు

గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకువస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్‌ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్‌లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్‌బుక్‌, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకునే కొనుగోలు చేస్తే బాగుంటుంది.

– బొమ్మినేని రవీందర్‌రెడ్డి,

కాటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

అకాల వర్షాలతో పత్తిలో అధిక తేమ

12 శాతం మించితే కొనుగోలు

చేయలేమంటున్న సీసీఐ

నేడు ఏనుమాముల మార్కెట్‌లో

కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

కొండా సురేఖ

పత్తి మద్దతు ధర క్వింటాలు : రూ.8,110

బహిరంగ మార్కెట్‌లో ధర: రూ.6,500 నుంచి రూ. 7వేల వరకు

ఉమ్మడి జిల్లాలో సాగైన పత్తి విస్తీర్ణం :

5.23 లక్షల ఎకరాలు

దిగుబడి అంచనా : 41.90 లక్షల క్వింటాళ్లు

ఆరబెట్టలేక.. అమ్ముకోలేక! 1
1/1

ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement