
బైబై..గణేశా!
నిమజ్జనం ఇలా..
కాళేశ్వరం దేవస్థానంలో..
నిమజ్జనానికి తరలించిన కలెక్టర్
గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు
● నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ● భారీ బందోబస్తుతో నిమజ్జనం
● వందల సంఖ్యలో తరలివచ్చిన గణనాథుల ప్రతిమలు, భక్తులు
కాళేశ్వరం: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడిని భక్తులు శుక్రవారం గోదావరిలో నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరిలో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వినాయక విగ్రహాల రథాలు భారీగా తరలి వచ్చాయి. పల్లెలు, పట్టణాల్లో వినాయక మండపాల్లోని కమిటీ సభ్యులు గల్లీగల్లీకి వినాయక విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజన, భక్తిసంకీర్తనలతో పూజించారు. వినాయకునికి ఇష్టమైన పిండి వంటలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అంగరంగ వైభవంగా మంగళవాయిద్యాలతో నృత్యాలు, మహిళలు కోలాటం ప్రదర్శనలు, యువత తీన్మార్ డాన్స్లతో గణేష్ మహరాజ్కీ జై.. గణపతిబప్పా మోరియా, బైబై గణేష్ అంటూ నినాదాలు పలుకుతూ గంగమ్మ ఒడికి సాగనంపారు.
నిమజ్జనం వద్ద అధికారులు..
ఇబ్బందులు కలుగకుండా అంతర్రాష్ట్ర వంతెన వద్ద జిల్లా అధికారులు పర్యవేక్షించారు. కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్, డీపీఓ వీరభద్రయ్య, తహసీల్దార్ రామారావు, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వైద్యాధికారి సుస్మిత వైద్యసేవలు అందించారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్, డీఈఈ పాపిరెడ్డి, నాగరాజు, శ్రీకాంత్, సదానందం అధికారులు విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి, నాయకులు మెంగాని అశోక్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద రెండు చోట్ల ఏర్పాటు చేసిన రెండు స్టాండ్లకు రెండేసి క్రేన్లతో విగ్రహాలను ఎత్తి విగ్రహాలను స్టాండ్లపై నుంచి గజఈతగాళ్ల సహాయంతో గోదావరి నీటిలోకి వదిలి నిమజ్జనం చేశారు. అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది.
కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపు చేసి భక్తిభజనలు, మంగళహారతులతో నిమజ్జనానికి తీసుకెళ్లారు. భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో నిమజ్జనం చేశారు. దేవస్థానం ఈఓ మహేష్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ రాహుల్ శర్మ నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తులు, యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ దిగ్విజయంగా జరుపుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు ప్రదీప్, సంగీత్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.