
భూరికార్డులను సిద్ధం చేయండి
లింగాలఘణపురం: భూభారతిలో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి అన్ని రకాల రికార్డులను ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూభారతి ఫిర్యాదులన్నీ పరిష్కారమయ్యే విధంగా రికార్డులను పరిశీలించాలని సూచించారు. సాదాబైనామాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అసైన్డ్లాండ్స్ సమస్యల పరిష్కారానికి కూడా మార్గదర్శకాలు నిర్దేశిస్తుందని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్ ఉన్నారు.
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
గంటల వ్యవధిలోనే రూ.70వేలు జమ
తరిగొప్పుల: నిరుపేద మహిళ మృతిచెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి అంత్యక్రియల్లో పాల్గొని నర్సాపూర్ గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి(36) అనారోగ్యంతో గురువారం మృతిచెందగా.. గ్రామస్తులు అండగా నిలిచారు. గంటల వ్యవధిలోనే సుమారు రూ.70 వేలు పోగుచేసి లక్ష్మి కుమారుడికి అందజేశారు. సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇతర గ్రామాలకు చెందినవారు సైతం సాయం చేసినట్లు నర్సాపూర్ వాసులు తెలిపారు.
ఉపాధ్యాయుల
సూచనలు పాటించాలి
జఫర్గఢ్: ఉపాధ్యాయుల సూచనలు విద్యార్థులు పాటించాలని తెలంగాణ మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ను సందర్శించారు. పాఠశాల గదులు, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసనను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దుర్గాప్రసాద్ను ఉపాధ్యాయులు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మోడల్ స్కూల్ నోడల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి
స్టేషన్ఘన్పూర్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ విద్యాకమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరారావు, డాక్టర్ చారగొండ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వారు స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఛాగల్లులో ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీఎస్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల పరిసరాలు, ఉపాధ్యాయుల రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల మధ్యాహ్న భోజనం తదితర విషయాలను తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠాలు సరిగ్గా అర్ధం అవుతున్నాయా.. అని తెలుసుకున్నారు. విద్యార్థులు ఇంగ్లిష్లో దారాళంగా మాట్లాడాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవాలని, అప్పుడే జీవితంలో రాణిస్తారని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల డైరీలు, పాఠ్యప్రణాళికలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, స్టాఫ్ సెక్రటరీ కొల్లూరు ప్రకాశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భూరికార్డులను సిద్ధం చేయండి