
బోధనలో మరింత నాణ్యత
జనగామ: సర్కారు బడుల్లో బోధనపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ సారించింది. పాఠశాల స్థాయిలో పటిష్టమైన పునాదులు వేయడానికి, బోధనలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024–25 ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్లో నిర్మాణాత్మక సమావేశాలతో విద్యార్థుల అభ్యాసనంలో పురోగతి సాధించారు. రేపటి నుంచి (శుక్రవారం) స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వందశాతం హాజరు కావాలి
జిల్లాలో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 130 పాఠశాలలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల పాటు ప్రధానోపాధ్యాయులు (సీహెచ్ఎం), మండల విద్యాధికారుల (ఎంఈఓ) పర్యవేక్షణలో నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు వందశాతం హాజరు కావాలి. ప్రతీ కాంప్లెక్స్ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్లో కాంప్లెక్స్ హెచ్ఎం ఆధ్వర్యంలో మీటింగ్ మినట్స్ను అప్లోడ్ చేయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైన టీచర్లకు మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ సర్టిఫికెట్ జనరేట్ చేయబడుతుంది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎం, రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులకు వీటిని చేరవేయాల్సి ఉంటుంది.
40 మందికి మించకూడదు
కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించే సమయంలో ప్రతి గదిలో 40 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండకుండా చూసుకోవాలి. పాఠశాల పరిధిలో ఐఎఫ్పీ ప్యానెళ్లు, సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు, టీఎల్ఎం ఉపాధ్యాయ హ్యాండ్ బుక్కులు, వర్క్ బుక్స్, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, కాంప్లెక్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల సేవలను ఉపయోగించు కోవాలని జీఓలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో పిల్లల పురోగతి, ఉత్తమ పద్ధతులు, వాటికి సంబంధించిన పూర్తి డేటాతో హాజరు కావాలి.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రేపటి నుంచి జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించనున్నాం. 1 నుంచి 5, 6 నుంచి 10 తరగతులకు సంబంధించి ప్రైమరీ, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలకు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసం 25వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి.
– భోజన్న, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల తేదీలు
1 నుంచి 5వ 6 నుంచి 9వ
నెల తరగతి వరకు తరగతి వరకు
(ప్రైమరీ కాంప్లెక్స్/తేదీ) (సబ్జెక్టు కాంప్లెక్స్/తేదీ)
మొదటి/రెండవ మొదటి/రెండవ
జూలై 25 26 30 31
ఆగస్టు 22 23 29 30
సెప్టెంబర్ 16 17 18 19
నవంబర్ 21 22 24 25
డిసెంబర్ 18 19 20 23
జనవరి–2026 23 24 30 31
ఫిబ్రవరి 20 21 24 24
నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి ఒక వేదికగా పని చేస్తాయి. బోధనలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థుల అభ్యాసన ఫలితాలను బలోపేతం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఉపాధ్యాయుల అనుభవాలను పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, భాగస్వామ్య అభ్యాసన సంస్కృతిని పెంపొందిస్తుంది. 1 నుంచి 5 తరగతులను నిర్వహించే అన్ని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీలు) పాఠశాల సముదాయ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల బోధనకు అంతరాయం కలగకుండా మొదటి రోజు 50శాతం, రెండవ రోజు మిగతా ఎస్జీటీలు హాజరు కావాలి. 6 నుంచి 9 తరగతులను నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల సహాయకులు (స్కూల్ అసిస్టెంట్లు), భాషా పండితులు (ఎల్పీ) సంబంధిత సబ్జెక్టు పాఠశాల సముదాయ ప్రాంగణాల్లో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి రోజు భాషా, రెండవ రోజు భాషేతర టీచర్లు రావాలి. ప్రతీ నెల రెండు కాంప్లెక్స్ సమావేశాలకు ఎంఈఓలు రెండుసార్లు తనిఖీ చేయాలి. సమావేశాల్లో ఉపాధ్యాయుల సూచనలను డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి, ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష శాఖలకు పంపించాలి. ప్రతి నెల 28వ తేదీన నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశంలో కాంప్లెక్స్లో తమ దృష్టికి వచ్చిన అందరి అభిప్రాయాలను సీహెచ్ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ సేకరించాలి.
రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ
వందశాతం ఉపాధ్యాయులు హాజరు కావాలి
ఏకోపాధ్యాయ పాఠశాలలు
ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

బోధనలో మరింత నాణ్యత

బోధనలో మరింత నాణ్యత