
చెక్డ్యాంలలో నీళ్లు నింపాలని నిరసన
జనగామ రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని, దేవాదుల ద్వారా చెరువులు, చెక్ డ్యాంలను నింపి ఆదుకోవాలని కోరుతూ జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం నిరసన తెలిపారు. చీటకోడూరు–యశ్వంతాపూర్ వాగుపై నిర్మాణం చేసిన చెక్ డ్యాంల్లో చుక్క నీరు లేక మోడు బారిపోయాయన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి దేవాదుల నీటిని విడుదల చేయని పక్షంలో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతాయని రైతులు బాల్నె ఉమాపతి, గొల్లూరి యాదగిరి, ఎర్ర రవి, గండి సుభాష్, మంగ రాములు, కొత్త సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎండుతున్న పంటల పరిస్థితిని చూసి కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు.
రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గైడ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు.
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు.
ముగిసిన ‘సకల కళల
సంబురాలు’
హన్మకొండ కల్చరల్: తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో.. తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన సకల కళలు సంబురాల జాతర–25 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాల నుంచి పలు కళారంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కళాబృందాలు హాజరై ప్రదర్శనలిచ్చారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యాపారవేత్త ఆడెపు రవీందర్, జ్యూరీ, చీఫ్ కో–ఆర్టినేటర్ టీవీ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు జడల శివ, హరిత దంపతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రదానం చేశారు. కళాకారులు సకల కళలు సంబరాల జాతర కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు, ఒగ్గుకథ, బుర్రకథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. పాల్గొన్న కళాకారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం జడల శివ మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు, సహాయం అందాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నాట్య కళాకారులు సమాఖ్య రాకం సంతోశ్, కోశాధికారి రామగిరి అర్జున్, పీఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చెక్డ్యాంలలో నీళ్లు నింపాలని నిరసన

చెక్డ్యాంలలో నీళ్లు నింపాలని నిరసన