
నోటరీ మ్యుటేషన్లపై ఆరా..!
జనగామ: జనగామ మున్సిపల్లో జరిగిన మ్యుటేషన్ల సవరణ, సెటిల్ మెంట్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అదనపు కలెక్టర్(ఏసీ) పింకేష్కుమార్ ఆరా తీశారు. ‘సెటిల్మెంట్ కింగ్ ఎవరు’, ‘సెటిల్మెంట్పై ఇంటలిజెన్స్ ఆరా’ శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అదనపు కలెక్టర్ శుక్రవారం మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ చాంబర్లో రెండున్నర గంటల పాటు రెవెన్యూ, అకౌంట్స్, పట్టణ ప్రణాళిక, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర విభాగాల వారీగా సమీక్షించారు. ఇటీవల మ్యుటేషన్ల సవరణకు సంబంధించి 22 మంది జాబితాను జతపరుస్తూ సీడీఎంఏ కమిషనర్ వెంకటేశ్వర్లుకు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఆరు నెలల కాలంలో నోటరీ, నిర్మాణాల రెగ్యులరైజేషన్, మ్యుటేషన్ల సవరణపై సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించా లని ఆదేశించారు. ఇక నుంచి నోటరీపై ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో చేసిన మ్యుటేషన్ల సవరణపై కూపీ లాగడంతో పాటు సదరు ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు, వ్యవహారంపై ఎక్కువ సమయం కేటాయించినట్టు సమాచారం. సమీక్షలో మేనేజర్ రాములు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది..?
పట్టణ ప్రణాళిక సేవలపై వివరాల సేకరణ
శాఖల వారీగా రెండున్నర గంటల పాటు సమీక్షించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్