
శిక్షణ ఐఏఎస్ల పర్యటన
జనగామ రూరల్/రఘునాథపల్లి : శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం సోమవారం జిల్లాలో పర్యటించింది. ఉషా నేతృత్వంలో కొయ్యడ ప్రణయ్, సౌరబ్ శర్మ, హరీశ్ చౌదరి, క్యారలీన్, సలోని బృందం మొదట కలెక్టర్ కార్యాలయాని కి చేరుకుంది. అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ వారితో సమావేశమై జిల్లా ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్లోని ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. తర్వాత జనగామ మండలం పెంబర్తి కోఆపరేటివ్ సొసైటీని సందర్శించి హస్తకళా కార్మికులతో మాట్లాడారు. వారు తయారు చేసిన వస్తువులను పరిశీలించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రవీందర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.