
రఘుపాల్ సేవలు మరువలేనివి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
జనగామ రూరల్: తెలంగాణ విప్లవ పోరాటంలో కామ్రెడ్ రఘుపాల్ మరణం సమాజ సేవకు అంకితమని, ఆయన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్హాల్లో మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన సీపీఎం మాజీ హైదరాబాద్ నగర కార్యదర్శి, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రెడ్ గంగసాని రఘుపాల్ సంస్మరణ సభ జరిగింది. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రఘుపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గం సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. అనంతరం రఘుపాల్పై సాంబరాజు యాదగిరి రాసిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, సూడి కృష్ణారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సింగారపు రమేష్, బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్, తదితరులు ఉన్నారు.