
సర్దుబాటు సబబేనా..!
సర్కారు స్కూళ్లకు శాపంగా మారనున్న టీచర్ల అడ్జెస్ట్మెంట్
జనగామ: సర్కారు స్కూళ్లలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు శాపంగా మారనుంది. ఓ వైపు ‘బడిబాట’ కొనసాగుతుండగా.. ఈనెల 13వ తేదీ వరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే సర్కారు ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. సర్దుబాటుతో ఉన్న విద్యార్థులను తరిమేయడం తప్ప మరొకటి కాదని అంటున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ పేరుతో విద్యను నిర్వీర్యం చేసే దిశలో ప్రయత్నించడంపై నిరసన వ్యక్తమవుతోంది.
ప్రైమరీ సెక్టార్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒక ఉపాధ్యాయుడితో నెట్టుకొస్తున్నారు. రేషనలైజేషన్తో ప్రాథమిక పాఠశాలలు కాస్త ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే అవకాశం ఉంది. మూత పడిన పాఠశాలలను ప్రారంభించాలని చెబుతూనే.. మరో వైపు వర్క్ అడ్జెస్ట్ పేరుతో ప్రైమరీ స్కూళ్లను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో ఒక పక్క ఉపాధ్యాయులను తొలగిస్తూ.. ప్రాథమిక విద్యలో తొలి మెట్టు లాంటి కార్యక్రమాలు ఎన్ని తీసుకొచ్చినా ఆరంభ శూరత్వమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సబ్జెక్టులు మాత్రం తగ్గవు.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు వస్తున్నాయి. కనీసం 40 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 41 నుంచి 60 వరకు ముగ్గురు, 61 నుంచి 90 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లు ఉండేలా చూడాలని అంటున్నారు. ఐదు తరగతులు, 20 సబ్జెక్టులను ఒక్క టీచర్ ఎలా బోధించ గలడో ప్రభుత్వం ఆలోచించాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి.
ఈనెల 13వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశాలు
ఓ వైపు ‘బడిబాట’.. మరో వైపు తొలగింపు
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లకు అడ్మిషన్లు వస్తే పరిస్థితి ఏమిటి?
ఆందోళనలో టీచర్లు.. మండి పడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
జీరో స్కూల్స్ 73
జిల్లాలో ఒక్క విద్యార్థికూడా లేని పాఠశాలలు 73 ఉన్నా యి. ఇందులో ఒకటి ఎయిడెడ్ (యూపీఎస్), 72 ప్రాథమిక పాఠశాలలు. ప్రస్తుతం ‘బడిబాట’ కార్యక్రమంలో జీరో స్కూల్ పరిధిలో విద్యార్థుల అడ్మిషన్లు వచ్చేలా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు.

సర్దుబాటు సబబేనా..!