
ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
జనగామ రూరల్: వ్యవసాయం మీద ఆధారపడి జీ వించే రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పని చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్క అధికారిని కలెక్టర్ అభినందించారు.
1,64,211.160 మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు
ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా సన్న రకం 107, దొడ్డు రకం 193 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 300 కేంద్రాల ద్వారా 1,64,211.160 మె.ట ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల ఖాతా ల్లో రూ.380 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.
సాఫీగా ధాన్యం కొనుగోలు
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు ముందస్తుగా ఏర్పాట్ల పైన తగిన శిక్షణ ఇచ్చి రైతులకు సరిపడా టార్పాలిన్లు అందజేశారు. ధాన్యం తూర్పారా పట్టేందుకు 120 అధునాతన ఆటోమేటిక్ యంత్రాలను అందుబాటులో ఉంచి తగినన్ని సంచులు సరఫరా చేయడంతో పాటు సకాలంలో ధాన్యం రవాణా చేశారు. ప్రతీరోజు కలెక్టర్ పర్యవేక్షణ, టెలీ కాన్ఫరెన్స్, గూగుల్ మీట్ ద్వారా పలు సూచనలు చేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా 1,64,211.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ప్రతీ గింజను కొనుగోలు చేశాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ అత్యధిక స్థాయిలో కొనుగోలు చేశాం. ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులు ఆయా కేంద్రాలను సందర్శించి సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించేలా తగు ఆదేశాలు తీసుకున్నాం. అందరి సహకారంలో జిల్లాలో కొనుగోళ్లు పూర్తి చేశాం.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు