అదనపు కలెక్టర్ రోహిత్సింగ్
బచ్చన్నపేట: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూ జలను నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో పలు భూ రికార్డులను పరిశీలించారు. త్వరలోనే దేవాదుల మూడో దశ పైప్ లైన్ నీరు వస్తాయని, రైతులు అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్రావు, డీటీ ఫణికిషోర్, ఏఆర్ఐ మున్వర్, అధికారులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయానికి వెండి హారతుల బహూకరణ
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుడు వెండితో తయారు చేసిన 8 రకాల హారతులను మంగళవారం బహూకరించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. ఆలయ అర్చకుడు దేవగిరి లక్ష్మన్న సూచనల మేరకు స్వామివారి పూజ కార్యక్రమాల్లో హారతులు ఇచ్చేందుకు నల్లగొండకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు సోమ కార్తీక్, తేజశ్రీ దంపతులు రూ.2,26,900 విలువైన 2 కేజీల292 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేసిన 8 హారతులను అందించినట్లు ఈఓ తెలిపారు.
విద్యారంగానికి
నిధులు కేటాయించాలి
జనగామ రూరల్: రాష్ట్ర బడ్జెట్లో విద్యకు మొత్తం బడ్జెట్లో 15శాతం నిధులు కేటాయించాలని సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఏకశిల డిగ్రీ కళాశాల నుంచి జనగామ చౌరస్తా వరకు చేరుకుని నిధులు పెంచాలని కోరుతూ ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ మాట్లాడుతూ విద్యకు బడ్జెట్ నిధులు పెంచే వరకు విద్యా మహోద్యమం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీల పేరు మారిస్తే విద్యా ప్రమాణాలు పెరగవని, వాటిని అన్ని స్థాయిల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధ్యాపకులను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భక్తుల ఇంటికే
భద్రాద్రి తలంబ్రాలు
● డీఎం స్వాతి
జనగామ: జనగామ ఆర్టీసీ డిపో లాజిస్టిక్స్ (కార్గో) ద్వారా భక్తుల ఇంటి వద్దకే సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ సీతారామ చంద్రస్వామి కల్యాణ తలంబ్రాలు అవసరమున్న భక్తులు జనగామ బస్టాండ్ ఆవరణలోని కార్గో లాజిస్టిక్స్ ఆఫీస్లో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాష్, సంబంధిత ఏజెంట్ను సంప్రదించి, రూ.151తో ముందస్తు బుకింగ్ చేసుకుని, రశీదు పొందాలన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం, తలంబ్రాలను కార్గో ఏజెంట్ ద్వారా ఇంటికి పంపిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9154 298762 నంబర్ను సంప్రదించాలన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలి
భూ సమస్యలు పరిష్కరించాలి