ముగిసిన బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బ్రహ్మోత్సవాలు

Mar 15 2025 1:46 AM | Updated on Mar 15 2025 1:44 AM

చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 6న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం అర్చకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించగా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు–కిరణ్మయి దంపతులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

కొడకండ్ల: ఆర్యవైశ్యులంతా సమస్యల పరిష్కారానికి సంఘటితమై ముందడుగు వేయాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన మండల ఆర్యవైశ్య నూతన కమిటీ ఎన్నిక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, ఆర్యవైశ్యుల సంక్షేమమే లక్ష్యంగా జిల్లా మహాసభ నిరంతరం తోడుంటుందన్నారు. మండల అధ్యక్ష పదవికి కొడకండ్లకు చెందిన దామెర శ్రీనివాస్‌ ఒక్కరే ఎన్నికల అధికారి మాధంశెట్టి వరూధినికి నామినేషన్‌ దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గన్ను నర్సింహులు, ఉపాధ్యక్షుడు ఈరంటి సాయికృష్ణ, కోశాధికారి బెజుగం భిక్షపతి, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజుగం అనుజ, పడకంటి రవీందర్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ఒంటిపూట బడులు

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ అన్ని పాఠశాలల్లోనూ ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమై కొనసాగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు తప్పనిసరిగా తరగతులు అయిపోయాక మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి టెన్త్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉన్నందున.. పరీక్ష కేంద్రాలుగా ఉన్న హైస్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థులకు ముందే మధ్యాహ్న భోజనం అందించి తర్వాత క్లాస్‌లు నిర్వహించాలని విద్యాశాఖాఽధికారులు తెలిపారు.

నేడు, రేపు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌ ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టెన్నీకాయిట్‌ అసోసియేషన్‌ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్‌, గోకారపు శ్యాంకుమార్‌ తెలిపారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు 300 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లు ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభంకానున్న పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు హాజరవుతారని వారు వివరించారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు1
1/2

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు2
2/2

ముగిసిన బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement