జగిత్యాల/రాయికల్/ధర్మపురి: ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జగిత్యాల, రాయికల్, ధర్మపురి మున్సిపాల్టీల్లో ఆస్తిపన్ను వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బకాయిదారులు ఈనెల 31లోపు పన్ను చెల్లించకుంటే వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. సకాలంలో చెల్లించకుంటే నల్లా కనెక్షన్లు తొలగించాలని పేర్కొన్నారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్లు స్పందన, కీర్తి నాగరాజు, శ్రీనివారావు, తహసీల్దార్ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.


