జగిత్యాల: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీఎం సదస్సుకు హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొండగట్టు గిరిప్రదక్షిణ
మల్యాల: కొండగట్టు గిరిప్రదక్షిణలో మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సురేశ్ఆత్మారాం మహరాజ్ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ ప్రదక్షిణ పూర్తి చేశారు.
ఖతార్ వలస కుటుంబాల్లో ఆందోళన వద్దు
మెట్పల్లి: ఖతార్ దేశానికి ఉపాధి నిమిత్తం వలస వచ్చిన వారి కుటుంబాలు యుద్ధం పట్ల ఎలాంటి ఆందోళనలు చెందవద్దని ఖతార్లోని తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాజా నిజాముద్దీన్ సూచించారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఉపాధి కోసం ఖతార్ వచ్చిన వారు వందలాది మంది ఉన్నారని, కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో తెలంగాణ వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగడం లేదన్నారు. ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఖతార్కు వచ్చిన ఉమ్మడి జిల్లా వాసులంతా క్షేమంగా ఉన్నారని, మీడియాలో వస్తున్న కథనాలను చూసి వారి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి కావొద్దని కోరారు.


