పనులు త్వరగా పూర్తి చేయాలి
ధర్మపురి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నుంచి జరుగనున్న బ్రహ్మోత్సవాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల పనుల ప్రగతిపై గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నందున సరిపడా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. అనంతరం గోదావరితీరం, మంగలిగడ్డ, ఆలయాలు, కల్యాణ మండపం, బ్రహ్మపుష్కరిణి కోనేరు, ఇసుక స్తంభం తదితర ప్రదేశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, కమిషనర్ శ్రీనివాస్, ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు.


