రూ.32 కోట్ల ధాన్యం మాయం
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు కేటాయిస్తుంది. సీఎమ్మాఆర్ (కస్టమ్ మిల్లింగ్)ను తిరిగి ఎఫ్సీఐ, సివిల్ సప్లై సేకరిస్తుంది. ఇలా కేటాయించిన ధాన్యాన్ని జిల్లాలోని కొంతమంది మిల్లర్లు అమ్ముకుని ప్రభుత్వానికి సీఎమ్మార్ అప్పగించలేదు. అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు అలాంటి మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. శనివారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిఫాల్ట్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. 2023–24 వానాకాలం ధాన్యం తీసుకున్న 14 మంది మిల్లర్లు సుమారు రూ.32 కోట్ల బియ్యం అప్పగించాల్సి ఉంది. ఆ మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులు తనిఖీలు చేసి అసలు ధాన్యమే లేనట్లు గుర్తించారు.
డిఫాల్ట్ మిల్లులకు ధాన్యం కేటాయింపు
గతంలో ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్లకు కూడా ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ ధాన్యం అప్పగిస్తున్నారు. డిఫాల్ట్ అయిన వారిపై చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేస్తున్నారు. డిఫాల్ట్ అయిన వారిపై క్రిమినల్ లేదా 6ఏ, లేదా జరిమానా విధించాల్సి ఉండగా నామామాత్రంగా 25శాతం పెనాల్టీ కట్టాలని ఆదేశించారు. కానీ.. మిల్లర్లు ఇప్పటివరకు పెనాల్టీ కట్టకున్నా వారికి మళ్లీ ధాన్యం కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వారు బ్యాంక్ గ్యారంటీగానీ, వారిపై కేసులు గానీ ఏవీ చేయకుండానే వారికి ధాన్యం ఇస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
రెగ్యులర్గా ఉన్న మిల్లులకు నో ధాన్యం
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి తిరిగి ప్రభుత్వానికి అప్పటించి ఎలాంటి డిఫాల్ట్ లేని మిల్లులకు అధికారులు ఇప్పటివరకు ధాన్యం కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారికి ధాన్యం ఎందుకు కేటాయించలేదన్నది కూడా అంతుపట్టడం లేదు. డిఫాల్టర్లకు ధాన్యం ఇచ్చి రెగ్యులర్ వారికి ధాన్యం ఇవ్వకపోవడంపై మిల్లర్లలో ఆందోళన నెలకొంది.
అర్హులకే ధాన్యం కేటాయింపు
ప్రస్తుతం ధాన్యం అర్హులైన మిల్లర్లకే కేటాయిస్తున్నాం. గతంలో డిఫాల్ట్ అయిన వారు ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంతో మళ్లీ ధాన్యం కేటాయించాం. రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. – జితేందర్రెడ్డి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి


