
ప్రహరీ లేక పరేషాన్
● జిల్లాలో 200కు పైగా ప్రహరీలు లేని పాఠశాలలు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ్డాగా కొన్ని స్కూళ్లు ● ఆవరణలోకి మూగజీవాలు, విష కీటకాల సంచారం ● భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు
మల్లాపూర్: సర్కారు బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. విద్యార్థులు ఇబ్బందుల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రకటనలు గుప్పిస్తున్న సర్కారు ఆ తర్వాత సౌకర్యాలపై పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు లేక రక్షణ కరువైంది. జిల్లావ్యాప్తంగా 511 ప్రాథమిక, 85 ప్రాథమికొన్నత, 187 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో మొత్తం 783 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మన ఊరు–మన బడి కింద ప్రహరీలు మంజూరయ్యాయి. కొన్ని ప్రగతిదశలో ఉండగా, మరికొన్నింటిలో పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలో 220 ప్రాథమిక, ప్రాథమికొన్నత, జెడ్పీ హైస్కూళ్లకి పూర్తిస్థాయిలో ప్రహరీలు లేవు. మిగిలిన పాఠశాలల్లో పాతగోడలు, మరికొన్ని చోట్ల ఒకవైపు కొంతమేర నిర్మాణాలు చేపట్టి మిగతా వైపు ఆసంపూర్తిగా వదిలేశారు. ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలో ఆవులు, గేదెలు, పందులు వస్తున్నాయి. ఇతర మూగ జీవాలు పాఠశాలల్లోకి ప్రవేశించి పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉదయం పాఠశాలలకు వచ్చే ఉపాద్యాయలు, విద్యార్థులకు పేడ కుప్పలు, చెత్తాచెదారం కనిపిస్తోంది. ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులే తొలగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూళ్ల ఆవరణలో హరితభారం కింద నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. మరికొన్ని పాఠశాలలు రాత్రివేళ మందుబాబులకు, ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారుతున్నాయని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు.
విష కీటకాలతో భయాందోళన
జిల్లాలోని చాలా పాఠశాలలు ఊరికి చివరన గుట్టలు, అటవీప్రాంతాలను ఆనుకొని ఉండటం, ప్రహరీలు లేకపోవడంతో విషపురుగులు, కీటకాలు వస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు లక్షలాది నిధులు విడుదలవుతున్నాయి. అయినా ప్రహరీలు ఎందుకు నిర్మించడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విడుదల చేసిన (సీడీపీ) నిధులతో పాఠశాలలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రహరీ నిర్మించాలి
హుస్సేన్నగర్ ప్రాథమిక పాఠశాల రహదారికి అనుకొని ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి ప్రహరీని నిర్మించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు కేటాయించాలి.
– సయ్యద్ హైదర్, మాజీ సర్పంచ్, హుస్సేన్నగర్
ఉన్నతాధికారులకు నివేదించాం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రహరీ, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్ని పాఠశాలల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. మరికొన్నింటికి నిధులు మంజూరు కావాల్సి ఉంది.
– రాము, జిల్లా విద్యాఽశాఖాధికారి, జగిత్యాల

ప్రహరీ లేక పరేషాన్

ప్రహరీ లేక పరేషాన్

ప్రహరీ లేక పరేషాన్