
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో(జూన్ 28 నుంచి జూలై 2 వరకు) అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31–32 డిగ్రిల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 64–74 శాతం, మధ్యాహ్నం 37–53 శాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య దిశ నుంచి బలమైన ఈదురుగాలులు గంటకు 13–22 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని, అయితే, జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నేడు జిల్లాలో మంత్రి పర్యటన
జగిత్యాల: జిల్లాలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బుగ్గారంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్లు పంపిణీ చేసి అనంతరం కోరుట్లలోని సాయిబాబాను దర్శించుకుని న్యూబస్టాండ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇస్కోనిగుట్టలో మొక్కలు పంపిణీ చేసి, కల్లూరు రోడ్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెట్పల్లిలోని కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ఇంటికి వెళ్లనున్నారు. తిరిగి ధర్మపురికి వెళ్లనున్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈగా సుదర్శనం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఈగా బి.సుదర్శనం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సాలీయానాయక్ నిర్మల్ జిల్లాకు బదిలీ కాగా, నిర్మల్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న సుదర్శనం జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు సాలీయానాయక్కు వీడ్కోలు, సుదర్శనంకు స్వాగతం పలికారు.
విద్యుత్ శాఖ డీఈగా మధుసూదన్
మెట్పల్లి: విద్యుత్ శాఖ మెట్పల్లి డివిజన్ ఇంజినీర్గా మధుసూదన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈలు మనోహర్, రఘుపతిలతో పాటు డివిజన్ పరిధిలోని ఏఈలు, యూనియన్ నాయకులు రాజవీరు, లక్ష్మణ్, హరిప్రసాద్లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు.
91శాతం రేషన్ పంపిణీ
జగిత్యాలక్రైం: జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులకు ఇప్పటి వరకు 91 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,18,731 రేషన్కార్డులు ఉండగా, ఈనెల 27 వరకు 2,90,517 మందికి రేషన్ దుకాణాల ద్వారా 91శాతం సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈనెల 30 వరకు 100 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఇంకా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు ఆందోళన చెందకుండా రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకోవాలని కోరారు. ఎవరైనా లబ్ధిదారులు సన్నబియ్యం అక్రమంగా అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘ఈ–పాస్’తోనే ఎరువులు విక్రయించాలి
పెగడపల్లి: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈపాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని కిసాన్ ఫర్టిలైజర్స్, సంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను శుక్రవారం సందర్శించి ఎరువుల నిల్వలు, వాటి నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ప్రతీ దుకాణం వద్ద స్టాక్ వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం పంటలకు ఎరువుల కొరత లేదని, అవసరం మేరకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఆయన వెంట ఏవో శ్రీకాంత్, సింగిల్విండోల సీఈవోలు గోపాల్రెడ్డి, మధూకర్ ఉన్నారు.

జిల్లాకు తేలికపాటి వర్ష సూచన