మ్యాపుల్లో సమస్తం | - | Sakshi
Sakshi News home page

మ్యాపుల్లో సమస్తం

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

మ్యాపుల్లో సమస్తం

మ్యాపుల్లో సమస్తం

సర్వే సమగ్రం..

జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు అధికం. రకరకాల సమస్యలతో రైతులు అనేక ఇబ్బంది పడుతుంటారు. రెవెన్యూ రికార్డు (పహాణి)ల్లో తప్పులు నమోదు కావడం.. సర్వే నంబర్ల వారీగా మ్యాప్‌లు లేకపోవడం.. కొన్ని గ్రామాల్లో కనీసం నక్షలు లేకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. వీటిని ఆసరా చేసుకుంటున్న కొందరు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం.. మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్లకు తప్పకుండా మ్యాప్‌ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. నక్షలు లేని గ్రామాల్లో సర్వే చేపట్టి మ్యాప్‌లకు రూపకల్పన ఇవ్వాలనే ఉద్దేశంతో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద రాష్ట్రంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని బీర్‌పూర్‌ మండలం కోమనపల్లిని ఎంపిక చేశారు. ఈ గ్రామంలో నక్ష లేకపోవడంతో పహాణీల్లో ఉన్న నంబర్ల ఆధారంగా సర్వే చేపట్టి మ్యాప్‌లు రూపొందిస్తారు. సర్వే ల్యాండ్‌ రికార్డుల శాఖ, రెవెన్యూ ఆధ్వర్యంలో ప్రైవేటు ఏజెన్సీ మార్వెల్‌ జియో ఫేషియల్‌ సొల్యుషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో కలిసి సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామసభ ఏర్పాటు చేశారు. కమిషనర్‌ ఆఫ్‌ సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ నుంచి ఆదేశాలు రావడంతో సర్వే మొదలుపెట్టారు. గ్రామంలో పూర్తి సర్వే చేసిన అనంతరం పహాణీల్లో ఉన్న సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్‌లను జారీ చేస్తారు.

వారం రోజుల్లో పూర్తి

బీర్‌పూర్‌ మండలం కోమనపల్లిలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపడుతున్న భూ సర్వే వారం రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత ఆధ్వర్యంలో వారికి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించి సర్వే గురించి వివరించారు. వారం రోజుల్లోపు సర్వే పూర్తి చేసి వారి సర్వే ప్రకారం నక్ష పటాలు అందించనున్నారు. ఇది విజయవంతం అయితే మరిన్ని గ్రామాల్లోనూ సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మరికొన్ని గ్రామాల్లో..

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద బీర్‌పూర్‌ మండలం కోమనపల్లిలో చేపడుతున్న సమగ్ర సర్వేతో మ్యాప్‌ల రూపకల్పన మరికొన్ని గ్రామాల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో ఎలాంటి మ్యాప్‌లు లేకుండా.. నక్షలు లేకుండా జిల్లాలో 16 గ్రామాలు ఉండగా ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద కోమనపల్లిలో సర్వే చేపడుతున్నారు.

కోమన్‌పల్లిలో 624 ఎకరాలు

కోమన్‌పల్లి గ్రామ పంచాయతీ కింద డొంకేశ్వరం, అన్నారం శివారు గ్రామాలుగా ఉన్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 1983–84లో బీర్పూర్‌ మండలం కోమన్‌పల్లి శివారుల్లో ముంపు బాధితులకు పునరావాసం కల్పించి.. ప్రభుత్వ భూములు అందించి వాటిని వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా మార్చింది. బాధితులందరికీ భూములపై హక్కులు కల్పిస్తూ.. వారికి డీ–1 సర్టిఫికెట్లను అందించింది. శ్రీరాంసాగర్‌ నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడి పరిస్థితులను చాలామంది తట్టుకోలేక ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను స్థానిక రైతులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం అందించిన డీ–1 సర్టిఫికెట్లను భూములు కొనుగోలు చేసిన వారికి అందించి తిరిగి వెళ్లిపోయారు.

భూముల వివాదాలకు చెక్‌

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా కోమనపల్లి ఎంపిక

విజయవంతమైతే మరిన్ని గ్రామాల్లో అమలు

వివాదాలకు చెక్‌

సర్వేలో భాగంగా గ్రామంలోని భూములకు హద్దులు గుర్తిస్తారు. ఇందులో

ఏ సర్వేనంబర్లు ఎందులో ఉన్నాయి..? అసైన్డ్‌ భూములు, గ్రామకంఠం భూములు ఎన్ని ఉన్నాయి..? అన్నది చూసి అనంతరం సర్వే చేపడతారు. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లకు అధికారులు బై నంబర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందులో కొన్ని గొడవలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక రైతుకు చెందిన భూమిలో ఎక్కువ సర్వేనంబర్లు ఉండటంతో రికార్డుల్లో ఉన్న భూమికి.. క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి అనేక తేడాలు ఉండటంతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. భూ విస్తరణ ఒకలా.. కాగితాల్లో మరొలా ఉండటంతో సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు అలాంటివి లేకుండా మ్యాప్‌లు తయారుచేసి ఇస్తారు. అనంతరం ఎవరైనా క్రయవిక్రయాలు చేసుకున్నా మ్యాప్‌ల ద్వారానే ఇస్తారు. ఈ సర్వేకు డ్రోన్‌ కెమెరాలు, అత్యాధునిక కెమెరాలతో సర్వే చేపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement