
జగిత్యాల మున్సిపాలిటీకే అధిక నిధులు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల: రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాని నిధులు జగిత్యాల మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగిందని, జగిత్యాల పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డు, 25వ వార్డులో రూ.8 లక్షలతో నిర్మిస్తున్న రోడ్డుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4,520 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మించగా పేదల సొంతింటి కల సాకారమైందన్నారు. పట్టణంలో 18 వేల ఇళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు, ఉచిత బస్సు సౌకర్యం, సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ యువ వికాసం అందజేయడం జరుగుతోందన్నారు. బీట్బజార్ మార్కెట్ త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడం వల్ల రానున్న వర్షకాలంలో వార్డులన్నీ జలమయం అయ్యే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కూతురు రాజేశ్, కూసరి అనిల్, నర్సమ్మ, గంగమల్లు, రాజకుమార్, డీఈ వరుణ్, ఏఈలు చరణ్, అనిల్ పాల్గొన్నారు.