
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని జైనా, దొంతాపూర్, మగ్గిడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలరోజులు గడుస్తున్నా.. తూకం వేయకపోవడం వైఫల్యానికి నిదర్శనమన్నారు. అలాగే తూకం వేసేటప్పుడు క్వింటాలుకు ఆరు కిలోలు తరుగు తీస్తున్నట్లు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు. రైతుల సమస్యలపై సివిల్ సప్లై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
సారంగాపూర్: బీర్పూర్ మండలంలోని పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరుగుతున్నాయని, వర్షానికి మొలకలు వస్తున్నాయని అదనపు కలెక్టర్కు రైతులు శనివారం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, విండో మాజీ చైర్మన్ మెరుగు రాజేశం, బీజేపీ నాయకులు గర్షకుర్తి రమేశ్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కందెనకుంట కేంద్రం నిర్వాహకులతో మాట్లాడిన లత కారణాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.