
మానవ అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత
జగిత్యాల: మానవ అక్రమ రవాణా నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ శిక్షణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అక్రమ రవాణాలో పేద, మధ్యతరగతి అమ్మాయిలే అధికంగా ఉంటున్నారని తెలిపారు. ఉద్యోగం, సినిమాల్లో అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముతున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ ట్రాకింగ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాల గురించి పిల్లలకు తెలపాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 30 వేల మంది మహిళలను కాపాడామన్నారు. మహిళల కోసం సఖీ, భరోసా, చైల్డ్లైన్, పోలీస్ టోల్ఫ్రీ, బీఎంఎస్ ఐటీపీఏ, పోక్సో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.