
అనుమతి లేని ల్యాబ్స్
● ఇష్టారాజ్యంగా పరీక్షలు ● అందినంతా దోపిడీ ● ప్రాణాలతో చెలగాటం ● చోద్యం చూస్తున్న వైద్యశాఖ
జగిత్యాల: ప్రజల ఆరోగ్యంతో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్)ల నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ప్రజల నుంచి అందినంతా దోచుకుంటున్నారు. వాస్తవానికి ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్యశాఖ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వైద్యశాఖ పట్టించుకోకపోవడంతో గల్లికో రక్త పరీక్ష కేంద్రాలు వెలిశాయి. చిన్నపాటి శిక్షణ పొందుతూ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఒక ల్యాబ్ఏర్పాటు చేయాలంటే సుమారు 100 స్క్వైర్ ఫీట్స్ గదితోపాటు అన్ని మిషన్లు ఉండాలి. ఎలాంటి మిషన్లు ఏర్పాటు చేయకుండానే ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా ల్యాబ్లో ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, టెక్నిషియన్స్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. ఇవి ఎక్కడ కూడా మచ్చుకై నా కనిపించవు. రోగికి చేసే పరీక్షల్లో ప్రమాణాలు పాటించడం లేదు. పరీక్ష చేసే కిట్లలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
గల్లీకొకటి..
జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ల్యాబ్లు, రక్త పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వెలిశాయి. ఆస్పత్రుల్లో, ల్యాబ్ల్లో పనిచేసిన వారు ఎలాంటి అర్హత లేకున్నా గల్లీకొకటి ఏర్పాటు చేశారు. చిన్నపాటి మెట్ల సందు ఉన్నా.. చిన్న షటర్ కనిపించినా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి విశాలమైన గదిలో ఏసీ, సెల్కాన్ మిషన్లు ఉండాలి. కానీ కొందరు నిర్వాహకులు ఏదో చిన్నపాటి మిషన్లు తెస్తూ పరీక్షలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రక్త, మూత్రపరీక్షలు చేస్తూ రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. రూ.100కు చేసే పరీక్షకు రూ.500 తీసుకుంటున్నారు.
విదేశాలకు వెళ్లేవారిని
జిల్లా నుంచి అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా దుబాయ్ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అన్ని పరీక్షలు చేయించుకుని మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకున్న ల్యాబ్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లే వారికి పరీక్షలు చేస్తూ వారికి అన్ని బాగానే ఉన్నట్లు రిపోర్ట్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ల్యాబ్ల ముందు విదేశాలకు వెళ్లే వారికి చెకప్ చేయబడునని బోర్డులు తగిలిస్తున్నారంటే వారి వ్యాపారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
‘జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలోగల దుర్గ కెమికల్ అండ్ బయోకెమికల్ ల్యాబ్కు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు. దీనిపై ఆరోపణలు రావడంతో వైద్యశాఖ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు..’ ఇలా ఈ ఒక్కటే కాదు.. జిల్లాలో అనేక ల్యాబ్లు అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. రోగుల నుంచి అందినంతా దోపిడీ చేస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ల్యాబ్లో ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, మైక్రో బయాలజిస్ట్ తప్పకుండా ఉండాలి. ఎక్కబడితే అక్కడ ల్యాబ్లను ఏర్పాటు చేయకూడదు. వైద్యశాఖ రిజిస్ట్రేషన్, అనుమతి ఉండాలి. ల్యాబ్ల్లో కావాల్సిన మిషన్లు ఏర్పాటు చేయాలి. కొన్నింటిని ఇప్పటికే సీజ్ చేశాం. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో

అనుమతి లేని ల్యాబ్స్