● తూనికల కొలతల అధికారుల పర్యవేక్షణ కరువు ● నష్టపోతున్న వినియోగదారులు
జగిత్యాల: జిల్లాలోని కిరాణాలు, సూపర్మార్కెట్లలో తూకాల్లో అనేక మోసాలు జరుగుతున్నాయి. వేయింగ్ మిషన్లలోని లొసుగులను తెలుసుకున్న వ్యాపారులు దాదాపు కిలోకు 150 గ్రాముల వరకు తక్కువగా ఇస్తూ వినియోగదారులను నష్టపరుస్తున్నారు. ఇలా కూరగాయల వ్యాపారుల నుంచి మొదలు కొని పెద్ద సూపర్మార్కెట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతేకాక వివిధ వస్తువులను ప్యాకెట్లలో నింపి ఏదో చిన్న స్టిక్కర్ అంటిస్తూ మోసం చేస్తున్నారు. కొనిన చోట్ల ఎలాంటి స్టిక్కర్లు వేయకుండా, ధర లేకుండానే విక్రయిస్తుండగా, మరికొన్ని చోట్ల షాపునకు సంబంధించి స్టిక్కర్ వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజల అవసరాలను వ్యాపారులు అవకాశంగా మార్చుకుని ప్యాకెట్ల రూపంలో వస్తువులను అంటగడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా తూనికలు, కొలతల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడే దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
అనుమతి లేకుండానే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా నిత్యావసర వస్తువులు ప్యాకింగ్ చేయాలంటే తప్పనిసరిగా తూనికల కొలతల శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కిరానాల్లో పప్పులు, చక్కెర, గోదుమపిండి తదితర వస్తువులను ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నారు. వీటితో పాటు తినుబండారాలైన చిప్స్, మురుకులు, కార, బోందీ తదితరవాటిని ప్యాకింగ్లలోనే విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిత్యావసర వస్తువులపై సంబంధిత కంపెనీ చిరునామాతో పాటు పూర్తి వివరాలు ఉండాలి. కానీ పలుచోట్ల ఇలాంటివి కన్పించవు.
జోరుగా జీరో దందా
జిల్లాలోని పలువురు వ్యాపారులు పన్ను తప్పించుకోవడానికి జీరో దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్యాకెట్లపై ఎలాంటి ముద్రణ, తేదీ, కన్జుమర్ నంబరు లేకుండానే కిలో, అరకిలో, పావుకిలో చొప్పున విక్రయిస్తూ జీరో దందాను కొనసాగిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
జగిత్యాలలో తూనికల కొలతల శాఖ కార్యాలయం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నెలలో ఒక్కసారైనా తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో వ్యాపారులది ఇష్టారాజ్యంగా మారింది. షాపుల్లోని వేయింగ్ మిషన్లలో వ్యత్యాసం రాకుండా నిత్యం తనిఖీలు చేపట్టాలి. కానీ అటువైపే చూడడం లేదు.
ధరల్లో సైతం తేడాలు
నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ రేట్లపైనే వస్తువులను విక్రయించాల్సి ఉండగా కొన్ని షాపుల్లో నిబంధనలు పాటించడం లేదన్నా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. సినిమా థియేటర్లలోనైతే ఇష్టారాజ్యంగా ధరలు ప్రకటించి విక్రయిస్తున్నారు. కొత్త సినిమా రోజు సినిమా థియేటర్లలో ఒక కూల్డ్రింక్ రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. ఒక పాప్కార్న్ రూ.40కి అమ్ముతారు. వాటర్ప్యాకెట్స్ రూ.10, వాటర్బాటిల్స్ రూ.40, చిప్స్ రూ.30కి విక్రయిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రతీ ప్యాకింగ్పై వివరాలు ఉండాలి
ప్రతీ ప్యాకింగ్ వస్తువుపై సంబంధిత కంపెనీ ముద్రణ, కన్జుమర్ నంబరు, ఎమ్మార్పీ రేట్లు ఉండాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. రోజూ తనిఖీలు చేపడుతున్నాం. తూనికల, కొలతల అధికారుల అనుమతి లేనిది ప్యాకింగ్ వస్తువులను విక్రయించరాదు. ఇలాంటి వాటిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మిషన్వారు సంవత్సరానికోసారి, తరాజుబాట్లు వాడేవారు రెండేళ్లకోసారి ముద్రణ వేయించుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.
– అజీజ్ పాషా,
తూనికల, కొలతల ఇన్స్పెక్టర్
అంతా కనికట్టు.. మోసం కనిపెట్టు
ఓవైపు పెట్రోలు కల్తీ ..మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం.. ఇదీ ఉమ్మడి జిల్లాలో అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం..అవగాహన లోపం.. బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. 8లోu
తూకంలో మోసం.. కల్తీ