భారత్‌కు కొత్త టెన్షన్‌!.. పాక్‌కు అండగా అమెరికా భారీ ప్లాన్‌? | US General Michael Kurilla Sensational Comments | Sakshi
Sakshi News home page

భారత్‌కు కొత్త టెన్షన్‌!.. పాక్‌కు అండగా అమెరికా భారీ ప్లాన్‌?

Jun 12 2025 8:22 AM | Updated on Jun 12 2025 8:22 AM

 US General Michael Kurilla Sensational Comments

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్తాన్‌ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్‌ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్‌ చేస్తోంది. ఓవైపు పాక్‌ ఉగ్రవాదంపై భారత్‌ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికా సెంట్రల్‌ కమాండ్‌(సెంట్‌కామ్‌) కమాండర్‌ జనరల్‌ మైఖేల్‌ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్‌ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్‌, ఖొరాసన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్‌లో పాక్‌ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్‌తోపాటు పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్‌తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.

కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్‌ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్‌ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్‌ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ అలర్ట్‌ అయినట్టు తెలుస్తోంది.

అమెరికా భారీ స్కెచ్‌..
ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసిమ్‌ మునీర్‌కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్‌ వాషింగ్టన్‌కు చేరుకుంటారని సీఎన్‌-న్యూస్‌ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్‌ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్‌ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్‌కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్‌ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement