మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం! | Middle East Conflict Latest News: Is Iran US War Back Again | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!

May 5 2026 7:00 AM | Updated on May 5 2026 8:36 AM

Middle East Conflict Latest News: Is Iran US War Back Again

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్‌జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.

గల్ఫ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్‌ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్‌ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్‌) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.

ఇటు హర్ముజ్‌లోనూ..
హర్ముజ్‌ జలసంధిలోనూ ఇరాన్‌ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్‌గానే ఉన్నాయని యూఎస్‌ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్‌లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.

ట్రంప్ ఏమన్నారంటే.. 
ఇరాన్‌ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. యూఎస్‌ నౌకలను.. యూఎస్‌ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్‌ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇరాన్‌ వైఖరి
యూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్‌ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు  ఇరాన్‌ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. గల్ఫ్‌ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్‌ ఫైర్‌ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్‌ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement