అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ లక్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) నగదు బహుమతిని మొత్తం నలుగురు గెలుచుకున్నారు.
ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.
లాటరీ గెలుచుకున్న భారతీయలు వీరే
కేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ నజీర్.. ఖతార్లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే ఖతార్లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడికి అదృష్టం వరించింది.
లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్లో నివాసముంటున్నాడు.
గత ఐదేళ్లుగా బిగ్ టికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది.


