మధ్యప్రాచ్య యుద్ధం ప్రభావం విమాన రంగంపైనా పడింది. ఈ నేపథ్యంలోనే దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి విమాన టికెట్ల ధరలను పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు (గురువారం) నుండి మధ్యాహ్నం 12:01 గంటలకు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఇండిగో తన టికెట్ ధరలను పెంచూతూ ప్రకటన విడుదల చేసింది. దేశీయ విమానాలలో గరిష్టంగా రూ. 950 వరకు అంతర్జాతీయ విమానాలలో రూ. 10,000 వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. మార్చి 14న మెుదటి సారి టికెట్ ధరలను పెంచగా తాజాగా మరోసారి ధరల పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది.
విమాన టర్బైన్ ఇంధనం పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) ప్రకారం, గత నెలలో ఇంధన ధరలు 130% కంటే ఎక్కువగా పెరిగాయని అందుకోసమే ఈ పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది. అయితే విమానయాన ఛార్జీల భారం అధిక మెుత్తంలో ప్రయాణికులపై పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.
దేశీయ విమానాల కోసం ఛార్జీలపై 25 శాతం పెంపును మాత్రమే ప్రభుత్వం అనుమతించింది.జెట్ ఇంధన ధరల పెరుగుదల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరను పెంచడమే కాకుండా, వారి భవిష్యత్ ఆర్థిక అంచనాలను కూడా ఉపసంహరించుకున్నాయి. జెట్-ఇంధనం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు. ఇది మొత్తం నిర్వహణ ఖర్చులలో 30% నుండి 40% వరకు ఉంటుంది.
కాగా ఇదివరకే న్యూజిలాండ్, హంకాంగ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విమానయాన సంస్థలు టికెట్ ధరల పెంపును ప్రకటించాయి.


