
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు.
దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.