దక్షిణ టర్కీలోని మెర్సిన్ నగరంలో సోమవారం తుపాకుల మోత మోగింది. ఓ దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కిష్ వార్తా సంస్థ డీహెచ్ఏ ప్రకారం... నిందితుడు మొదట ఒక రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నగరంలోని మరో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. అనంతరం దుండగుడు కారులో పారిపోయినట్లు డీహెచ్ఏ తమ కథనంలో పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 17 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు.
నిందుతుడి కోసం పోలీసులు హెలికాప్టర్లతో సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్ధానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో రెస్టారెంట్ యజమాని, అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నారు. నగరంలోని వేరే చోట జరిగిన కాల్పుల్లో పశువులను మేపుకుంటున్న ఒక యువకుడు, అలాగే ఒక ట్రక్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.
చదవండి: పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్కు రహస్యంగా..


