
గణనాథులను నిమజ్జనానికి తరలించే టస్కర్ (లారీ) డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.
హిమాయతనగర్: గణనాథులను నిమజ్జనానికి తరలించే టస్కర్ (లారీ) డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దుర్ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. బండ్లగూడకు చెందిన షేక్ షబాజ్ అహ్మద్ తన స్నేహితులతో కలిసి డీఆర్డీఏ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్దకు గురువారం వెళ్లారు.
వీరంతా నిమజ్జనంలో పాల్గొని శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నారాయణగూడ ప్రధాన రహదారిపై ఉన్న మసీదు వద్దకు వచ్చారు. పాన్ తెచ్చుకునేందుకు షేక్ షబాజ్ అహ్మద్ టస్కర్ దిగాడు. పదిహేను నిమిషాల అనంతరం వచ్చి టస్కర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా దీని డ్రైవర్ హఠాత్తుగా స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. షబాజ్ అహ్మద్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో వెనక చక్రాలు కాలుపై నుంచి వెళ్లాయి. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. తోటి స్నేహితులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందినట్లు నారాయణగూడ పోలీసులకు వైద్యులు సమాచారం ఇచ్చారు.
బలవంతంగా వచ్చి బలయ్యాడు..
బహదూర్పురాలోని ఎస్పీనగర్కు చెందిన చాపల బండ ప్రణీత్ స్నేహితులతో కలిసి నిమజ్జనానికి ట్యాంక్బండ్కు వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున సంజీవయ్య పార్క్ వద్ద ప్రణీత్ మరో ముగ్గురు మూత్ర విసర్జన కోసం టస్కర్ దిగారు. అయిదు నిమిషాల తర్వాత ప్రణీత్తో ఉన్న ముగ్గురు టస్కర్ ఎక్కగా.. ప్రణీత్ ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా కదిలించాడు.
దీంతో వెనక్కి పడ్డ ప్రణీత్ తలపై నుంచి టస్కర్ వెళ్లడంతో తల నుజ్జునుజ్జయింది. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సెక్రటేరియ (లేక్) ఎస్హెచ్ఓ దెబోరా తెలిపారు. నిమజ్జనానికి రానంటూ మారాం చేసిన వ్యక్తిని మొదటిసారి తీసుకొచ్చి తప్పు చేశామే అంటూ తోటి స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.
నాలుగేళ్లకే ఆయుష్షు తీరింది..
లక్డీకాపూల్: నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు సంతోష్నగర్ గవర్నమెంట్ ప్రెస్ కాలనీకి చెందిన రాజశేఖర్, సాయిప్రియ దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు అయాన్ష్తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.
బషీర్బాగ్లోని లిబర్టీ సిగ్నల్ ప్రాంతంలో రాగానే బైక్ స్కిడ్ అయ్యింది. తల్లిదండ్రుల మధ్యలో కూర్చున్న అయాన్ష్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో హుస్సేన్సాగర్ వైపు సాగిపోతున్న గణేష్ నిమజ్జన టస్కర్ బాలుడిపై నుంచి వెళ్లింది. గాయపడిన అయాన్ష్ను చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తండ్రి రాజశేఖర్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.