హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రతీ రేషన్ కార్డులో నమోదైన సభ్యుడికి ఈనెల 31లోపు ఈ–కేవైసీ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని రేషన్ డీలర్లను హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. ఈలక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ–కేవైసీ పురోగతిని సమీక్షించారు. ఇంకా.. ఈ–కేవైసీ చేయించుకోని లబ్ధిదారులను వ్యక్తిగతంగా సంప్రదించి దుకాణాలకు రప్పించాలని, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి ఈ–కేవైసీ పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించారు. గడువులోగా ఈ–కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్లో రేషన్ సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమస్యలు ఎదురైతే సంబంధిత మండల పౌర సరఫరాల అధికారిని లేదా సమీప ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ను సంప్రదించాలని సూచించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీని రాజకీయాలకు అడ్డాగా మార్చకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కేయూని సందర్శించిన ఆయన గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేయూలో నెలకొన్న సమస్యలపై గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు వర్సిటీ అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించాక అధికారులు సమగ్ర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించారని, దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయూలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. కొందరు కావాలనే వివాదం సృష్టించారని ఆరోపించారు. కేయూకు రావా ల్సిన నిధులు అభివృద్ధి పనులు వైస్ చాన్స్లర్ నిర్లక్ష్యం వల్లనే ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. మామునూరు విమానాశ్రయంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కులేదని రాజేందర్రెడ్డి అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పక్కనే కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కేయూ ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి ఉన్నారు.
కాళోజీ సెంటర్: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు హెచ్సీఎల్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ‘టెక్ బీ ప్రోగ్రాం’ కోసం నేడు (శనివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటలకు హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలకు జిల్లా ఇన్చార్జ్ నరేశ్ (75691 77071, 79818 34205)ను సంప్రదించాలని కోరారు.


