
స్కూళ్ల అభివృద్ధిలో భాగస్వాములుకావాలి
● జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి
విద్యారణ్యపురి: సర్కారు స్కూళ్ల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం ఉపాధ్యాయుల బాధ్యత అని, అలాగే పాఠశాలల ఆస్తిత్వాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులేదనన్నారు. ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతాయని, తప్పనిసరిగా హాజరై తమ పిల్లల చదువు, పాఠశాలల అవసరాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, పాఠశాల హెచ్ఎం జి.వి. రామారావు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ వల్స పైడి తదితరులు పాల్గొన్నారు.