
ఎయిర్పోర్ట్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
న్యూశాయంపేట/ఖిలా వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ రోడ్ల కనెక్టివిటీ కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం ఆమె పర్యటించారు. రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరుపల్లి నుంచి నేషనల్హైవే వరకు, నక్కలపల్లి నుంచి గాడిపల్లి–గాడిపల్లి బైపాస్ వరకు రోడ్ల స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడానికి త్వరితగతిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారి రమేశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, అధికారులు పాల్గొన్నారు.
భూనిర్వాసితులకు త్వరితగతిన పరిహారం..
న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములిచ్చిన భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ లేఔట్ అనుమతుల పురోగతి తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొర్రెకుంట, ఏనుమాములతోపాటు ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ ఏర్పాటుకు లేఔట్ అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కేఎంటీపీ జోనల్ మేనేజర్ స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, కుడా పీఓ అజిత్రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, రాజ్కుమార్, మహ్మద్ ఇక్బాల్, రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.
బడిబాటను విజయవంతం చేయాలి..
ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండల పరిధి గుంటూరుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నూతనంగా బడిలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ ఫారాలు అందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఓ రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎయిర్పోర్ట్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి