
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
హన్మకొండ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ 58, 59వ డివిజన్ పరిధి హనుమకొండలోని ఇందిరానగర్, ఎన్జీవోస్ కాలనీ, భవానినగర్లో ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య పనులను, డిసిల్టేషన్ ప్రక్రియ, తడి, పొడిచెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించడం, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా దోమలను అరికట్టడానికి చేపట్టే యాంటీ లార్వా ఆక్టివిటీస్, ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల తీరును కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దన్నారు. బట్ట సంచులు, జ్యూట్ బ్యాగులను వినియోగించాలని నగరవాసులకు సూచించారు. కార్పొరేటర్లు గుజ్జుల వసంత, ఇమ్మడి లోహిత రాజు, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఈ సారంగం, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్ పాల్గొన్నారు.