
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో రెండు జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి