
అభివృద్ధిలో టెక్స్టైల్ పార్క్ కీలకం
న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం కలెక్టరేట్లో డైరెక్టర్ ఆఫ్ టెక్స్ౖటైల్ ధరణికాంత్తో కలిసి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో టెక్స్టైల్ రంగంలో సమగ్ర మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు, మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, స్థానిక ఉత్పత్తిదారుల సహకారంతో ఈ పార్క్ దేశంలో మోడల్ టెక్స్టైల్ పార్క్గా గుర్తింపు పొందేందుకు కృషి చేయాలన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాల ‘కుడా’ లేఅవుట్ అనుమతులు అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్, జోనల్ మేనేజర్లను ఆదేశించారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ టెక్స్టైల్ ధరణి కాంత్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇండస్ట్రీయల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి కల్పించవచ్చో అలాంటి స్థానాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కేఎంపీటీ జోనల్ మేనేజర్ స్వామి, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
అధికారులతో సమీక్ష