విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు నీటిని నిలుపుదల చేశారు. గత నెల 25న తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు 10 టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తి అవ్వటంతో కుడికాలువకు పూర్తిగా నీటిని నిలుపుదల చేశారు. కార్యక్రమంలో డీఈఈ టి మురళీధర్, ఏఈఈ సుధ, డ్యాం సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు.
పెదకాకాని: సినీ నటుడు వడ్డే నవీన్ హీరోగా స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ట్రానన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం వీవీఐటీయూలో సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చిత్ర బృందం ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. కార్యక్రమంలో హీరో వడ్డే నవీనన్తో పాటు హీరోయిన్ రాశి సింగ్ పాల్గొన్నారు. చిత్రబృందానికి వీవీఐటీయూ ప్రో–ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ స్వాగతం పలికారు. నవీన్ మాట్లాడుతూ ఈ చిత్రం బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చిత్రబృందం విద్యార్థులతో కలసి నృత్యాలు, సెల్ఫీలతో సందడి చేసింది.
బాపట్లటౌన్: బైండోవర్ బాండ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో నిందితుడిగా ఉన్న స్టువార్టుపురం గ్రామానికి చెందిన మాదిగాని రామచంద్రకుమార్ అలియాస్ పప్పును వెదుళ్లపల్లి పోలీసులకు సోమవారం కోర్టుకు అప్పగించారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 30 రోజుల రిమాండ్, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు అనుమతితో సోమవారం రామచంద్రకుమార్ను బాపట్ల సబ్జైల్కు తరలించారు.
గుంటూరు లీగల్: వృద్ధులకు ఏమైనా న్యాయపరమైన సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు సోమవారం ఎస్వీఎన్ కాలనీ సమీపంలోని దాక్షిణ్య మానసిక వికలాంగుల స్కూల్, ఓల్డ్ ఏజ్ హోంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తొలుత దాక్షిణ్య స్కూల్ను సందర్శించి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అక్కడవున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం కోయవారిపాలెం, గుంటూరులోని నవీన్ ఆదర్శ్ మహిళా మండలి ఓల్డ్ ఏజ్ హోంను సందర్శించి, వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నలందా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని హైవే రోడ్డుపై గుర్తు తెలియని పాప తిరుగుతుండటాన్ని సత్తెనపల్లి పోలీసులు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. పాప తన పేరు షేక్ జాన్, తండ్రి గౌస్ అని, గుంటూరు క్లబ్ వద్ద చినపలకలూరు గ్రామంగా చెబుతుందని ఎస్ఐ అమిరుద్దీన్ తెలిపారు. పాప ఆచూకీ తెలిసిన వారు సత్తెనపల్లి రూరల్ సీఐ, ఎస్ఐ, పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.


