కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అన్ని విధాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ బ్యాంక్ మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. నిజమైన రైతులకు పంట రుణాలు అందించాలని సూచించారు. రైతులు తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలన్నారు. అంతేకాకుండా రుణాల రికవరీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తేనే ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ సీఈఓ ఫణికుమార్ మాట్లాడుతూ పీఏసీఎల్ల కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని, అందుకు పీఏసీఎస్ల చైర్మన్లు చొరవ చూపాలని కోరారు. పలువురు పీఏసీఎస్ల అధ్యక్షులు మాట్లాడుతూ పలుచోట్ల చెరువు భూములను కూడా పంట భూములుగా మార్చి రుణాలు పొందారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. పీఏసీఎస్లకు రావాల్సిన డివిడెండ్ను ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సహకార బ్యాంక్ నుంచి పీఏసీఎస్లకు రావాల్సిన అలవెన్స్లు ఒక్క రూపాయి కూడా రావడం లేదని వాపోయారు. సమావేశంలో పీఏసీఎస్ల చైర్మన్లు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


