జనసందోహంగా మారిన
నగర పుర వీధులు
నగరంపాలెం: శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పాతగుంటూరు మణిహోటల్ సెంటర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద శోభాయాత్ర ప్రారంభించారు. ఏపీ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, తూర్పు ఎమ్మెల్యే నసీర్అహ్మద్లు హాజరై ప్రారంభించారు. మణిహోటల్ సెంటర్ వద్ద ప్రారంభమైన శోభాయాత్ర బాలాజీనగర్, శ్రీరాధాకృష్ణ మందిరం, పాత గుంటూరు, యాదవబజార్, పాతగుంటూరు ఆంజనేయస్వామి గుడి, బీఆర్.స్టేడియం, పాత బస్టాండ్ జిన్నాటవర్, నగరంపాలెం, జూట్మిల్, పట్టాభిపురం, బృందావన్గార్డెన్, లక్ష్మీపురం, లాడ్జిసెంటర్, అమరావతిరోడ్, నగరాలు, గోరంట్ల శ్రీపద్మావతి అండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు కొనసాగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు అంకరాజు శశాంక్శర్మ ఆధ్వర్యంలో జరగ్గా, సభ్యులు భూపతి ఈశ్వరరావు, యడ్ల హిమగిరి పాల్గొన్నారు.
శిల్పారామంలో స్టాళ్ల కోసం సంప్రదించండి
గుంటూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్నర్ రింగ్రోడ్డులోని శిల్పారామంలో సందర్శకులను ఆకర్షించే ఆటవస్తువులు, సాహస క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ కోసం ఆసక్తిగల ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని శిల్పారామం నిర్వాహకుడు ప్రసాదరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత స్టాళ్ల నిర్వహణకు, హస్తకళల విక్రయాలు, ప్రదర్శనల కోసం ఖాళీ స్థలాన్ని కేటాయించేందుకు సమర్థులైన అర్హత కలిగిన ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ అవకాశం ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే ఉన్నదని తెలిపారు. మరిన్ని వివరాలకు 8886652023, 8886652012 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు.
వాగు ఒడ్డున పురాతన
ఆంజనేయస్వామి విగ్రహం
రొంపిచర్ల: స్థానిక చపా రపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని శుక్రవారం స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూ డు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం స్థానికులు చూశారు. విగ్రహం ముఖ భాగం కనిపించకుండా ఉండటంతో స్థానికులు తొలుత దానిని రాయిగా భావించారు. శుక్రవారం గ్రామస్తులు కొందరు రాయిని దొర్లించగా విగ్రహం కనిపించింది. విగ్రహం ముక్కు, ఛాతీ, మొఖం, గధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జేసీబీ బక్కెట్లో విగ్రహాన్ని ఉంచి ఇక్కడకు తీసుకొచ్చి పడవేసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే విగ్రహం ధ్వంసం అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఆ విగ్రహాన్ని గుడిలోకి చేర్చి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి గాయాలయ్యాయి. వినుకొండ – వెల్లటూరు మధ్యలో ఉన్న కురవ దగ్గరలోని పార్కు సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వర్లు (27) మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మృతుడు చింతపల్లి వెంకటేశ్వర్లుకి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


