గోళ్ళపాడు(ముప్పాళ్ళ): మద్యం మత్తులో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం పై వస్తూ రహదారిపై ఆగిఉన్న లారీ డ్రైవర్ పై దాడిచేసి లారీ అద్దాలు పగలగొట్టిన సంఘటన నరసరావుపేట–సత్తెనపల్లి ప్రదాన రహదారిపై మండలంలోని గోళ్ళపాడు సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం నుంచి మొక్కజొన్న పొత్తుల లోడ్తో పోరుమామిళ్ళ బయలుదేరిన ఏపీ07టీజే1454 నెంబర్ లారీ గోళ్లపాడు గ్రామంలోని లోలెవల్ చప్టా దాటాక లారీలోని మొక్కజొన్న పొత్తుల బస్తాలు పక్కకి వరిగిపోవటంతో రహదారి పక్కన ఆపి సరిచేసుకుంటున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనం పై ముగ్గురు యువకులు నరసరావుపేట వైపు నుంచి వస్తూ ఆగి ఉన్న లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య, క్లీనర్ నందిపాటి ప్రవీణ్కుమార్లను లారీ రోడ్డు పై ఆపావేంట్రా...అని గొడవపడి బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో కొట్టడం ప్రారంభించారు. భయపడిన డ్రైవర్, క్లీనర్లు పరిగెత్తేందుకు యత్నిస్తుండగా అడ్డగించి మళ్లీ దాడికి దిగారు. అంతటితో ఆగకుండా రాళ్ళతో లారీ అద్దాలు, హెడ్లైట్ పగలకొట్టారు. భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్లు పొలాల గుండా ముప్పాళ్ళ పోలీస్స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. జరిగిన సంఘటనపై లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య అందించిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు.
అర్ధరాత్రి ఆగి ఉన్న లారీ అద్దాలు ధ్వంసం


