జీఎంసీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ నెహ్రూనగర్
(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శుక్రవారం బాధ్యతల స్వీకరించారు. నగర కమిషనర్ మయూర్ అశోక్, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇతర విభాగాధిపతులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మాన్ సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మే నెలలోపు నగరంలోని ప్రధాన, అంతర్గత డ్రెయిన్లలో నూరు శాతం పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో పీకల వాగు, ఇతర అవుట్ ఫాల్ డ్రెయిన్లపై ఆక్రమణలపై సర్వే చేసి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిటీ ప్లానర్ను ఆదేశించారు. గతేడాది నీటి ఎద్దడి ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మేజర్, మీడియం డ్రెయిన్లలో మేష్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పడు మేష్ల దగ్గర చెత్తను తొలగించాలన్నారు. రిజర్వాయర్లు, వాటిని శుభ్రం చేసే విధానం గురించి తెలుసుకొని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
తెనాలి ప్రత్యేకాధికారిగా జేసీ
తెనాలి అర్బన్: తెనాలి పురపాలక సంఘ ప్రత్యేకాధికారిగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని ఆయన కార్యాలయానికి మున్సిపల్ అధికారులు వెళ్లి సంతకం చేయించారు. మంగళవారం తెనాలి వచ్చి రివ్యూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకాధికారిని కలిసిన వారిలో ఎంఈ పినప శ్రీకాంత్, ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవ్వా ఏసుబాబు, ఏసీపీ వాణి, ఆర్వో రాంప్రసాద్, శ్యామలదేవి తదితరులు ఉన్నారు.