ఉబర్ తరహాలో డ్రోన్ సేవలు
గుంటూరు వెస్ట్: ఉబర్ తరహాలో డ్రోన్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఈ డ్రోన్ సేవలు ఎంతో ఉపయోగకరమన్నారు. ఉబర్ క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా రాష్ట్రంలో సేవలు లభిస్తాయని చెప్పారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు డ్రోన్ ద్వారా చల్లడం వంటి ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఒకే యాప్లో అనేక సేవలు లభిస్తాయని చెప్పారు. డ్రోన్ వినియోగం వల్ల సమయం, కూలి ఆదా అవుతుందని అన్నారు. సమీప ప్రాంతంలోనే అద్దెకు డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్లే స్టోర్లో ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్న్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా లేదా సంబంధిత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల డ్రోన్ సేవలు పొందవచ్చన్నారు.
యువత జీవితాలను కాపాడుదాం
మాదక ద్రవ్యాలను నివారించి, యువత జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు.
● ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. 118 మందిపై కేసులు నమోదు చేశామని, గుంటూరు పట్టణంలో 28 హాట్స్పాట్లు, 92 ఉపయోగంలో లేని భవనాలు గుర్తించామని చెప్పారు.


