కోలుకున్నాకై నా... మేలుకుంటారా?
ఇకనైనా కళ్లు తెరుస్తారా..
● భారీ వర్షాలు, వరదల
వేళ గుంటూరులో సమస్యలు
● కొన్నిచోట్ల డ్రైయినేజీలు లేక,
మరికొన్నిచోట్ల ఉన్నా పూడిక
తీయక ఇబ్బందులు
● చినుకుపడితే రోడ్లు జలమయం
కావడంతో ట్రాఫిక్ సమస్య
● మోంథా తుఫాన్ హెచ్చరిక
వచ్చాక పూడిక తీసిన అధికారులు
● వేసవిలో చేయాల్సిన పనులు
తూతూమంత్రంగా చేసిన వైనం
● ప్రజాప్రయోజనం మరిచి
నిధులు వృథా చేస్తున్న యంత్రాంగం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మోంథా తుఫాన్ ప్రభావం నగరంపై అంతగా లేకపోయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఊహాగాలతో నగరంలో డ్రైయిన్లపై ఉన్న ఆక్రమణలను హడావుడిగా పగలకొట్టించారు. దీంతోపాటు వర్షం పడిన ప్రతి సారి గుంటూరు మునిగిపోతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రధాన డ్రైయిన్లలో పూడికతీత పనులు చేపట్టారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో వర్షం పడితే చాలు అన్ని ప్రాంతాల్లోని వీధులు జలమయంగా మారుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లన్నీ మోకాలి లోతు వరకు వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాల రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వేసవిలో చేయాల్సి ఉన్నా...
గుంటూరు నగరంలో పీకలవాగు, నంది వెలుగు రోడ్డులోని డ్రైయిన్, సుద్దపల్లిడొంక, పొన్నూరు రోడ్డులోని డ్రైయిన్, గొట్టాలబజార్లోని డ్రైయిన్, అంబేడ్కర్ వాగులు ప్రధానమైనవి. ప్రధానంగా పీకలవాగు పశ్చిమ నియోజకవర్గంలోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నుంచి ప్రారంభమై నగరంలోని చిన్న కాలువలను, మిగతా పెద్ద డ్రైన్లను కలుపుకొంటూ బుడంపాడు వరకు ప్రవహిస్తుంది. దీంతోపాటు చుట్టుగుంట శ్రీనివాసరావుపేట నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు కూడా తూర్పు నియోజకవర్గం మీదుగా పొన్నూరు రోడ్డులోని ప్రధాన డ్రైయిన్లోకి కలుస్తుంది. నగరంలో 210 కిలోమీటర్ల మేర డ్రైన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో మేజర్వి 125.28 కిలోమీటర్లు, మధ్యస్థమైనవి 67.41, మైనర్ డ్రైన్లు 16.25 కిలో మీటర్లుగా ఉన్నాయి. వర్షకాలానికి ప్రారంభానికి ముందే మాన్సూన్ యాక్షన్ ప్లాన్ కింద డ్రైన్లలో పూడికతీత పనులు చేపడుతుంటారు ఇంజినీరింగ్ అధికారులు. అయితే ఈ పనులు ౖపైపెన చేసుకుని రూ.4.78 కోట్ల బిల్లు పెట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మోంథా తుఫాన్ కారణంగా నగర పరిధిలో ఉన్న ప్రధాన డ్రైయిన్లలో పూడిక తీత పనులు చేపట్టారు. అదేదో ఎండకాలంలో సక్రమంగా పూడిక తీసి ఉంటే మరలా రెండో సారి పూడికతీత తీసే పని ఉండేది కాదు కదా అని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో డ్రైయిన్లు సక్రమంగా లేకపోవడంతో పరిస్థితి ఆధ్వానంగా తయారవుతోంది. ముఖ్యంగా అరండల్పేటలో డ్రైయిన్లు లేకపోవడంతో చిన్న వర్షానికి కూడా రోడ్లు మునిగిపోతున్నాయి.
గుంటూరు నగరంలో దాదాపు 10 లక్షలకుపైగా జనాభా ఉంది. రాజధాని ప్రాంతం కావడంతో జనాభా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నగరంలో వర్షం వస్తే నీట మునిగిపోతున్న దుస్థితి నెలకొంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ముఖ్యంగా మూడు వంతెనల వద్ద ట్రాక్ కింద రూ.కోటి వ్యయంతో మరో డ్రైన్ నిర్మించాల్సి ఉంది. దానిని రైల్వే అధికారులు పట్టించుకోవడంలేదు. దీనిని సమన్వయం చేసుకోవాల్సిన ఇంజినీరింగ్ అధికారులు కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొండిగేటు (నందివెలుగు రైల్వే గేటు)వద్ద డ్రైన్ చిన్నగా ఉంది. దానిని పెద్దగా చేస్తే నీట మునిగే సమస్య తగ్గుతుంది. ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో పీకలవాగుపై డ్రైన్ అసంపూర్తిగా నిలిచిపోయింది. దీనిని పూర్తి చేస్తే వరదలు, వర్షం పడినప్పుడు ముంపు సమస్య తగ్గుతుంది.
స్వచ్ఛ సూపర్ లీగ్ నగరాల జాబితాలో చోటు దక్కించుకుని ఇటీవల అవార్డు దక్కించుకున్న గుంటూరు నగరపాలక సంస్థ.. వర్షం పడితే ఎటు చూసినా జలమయం అవుతోంది. వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో పాలకులు, అధికారులు విఫలం అయ్యారు. పైగా అడ్డగోలు పనులతో ప్రజాధనం వృథా చేయడంతోపాటు అవసరమైన పనులు చేపట్టకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కోలుకున్నాకై నా... మేలుకుంటారా?


